నేడు విచారణకు హాజరు..!
బ్యాంక్లకూ ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్, ఫ్రాడ్ కేసులో రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీకి మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి సంబంధిత రుణ ఖాతాలకు సంబంధించిన వివరాలను కోరింది. దాదాపు 13 బ్యాంక్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీటిల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగం బ్యాంకులు ఉన్నాయి. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు బ్యాంక్లు భారీగా రుణాలు ఇచ్చాయి.
రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ అప్పులను అక్రమంగా మళ్లించాయని, మనీలాండరింగ్కు పాల్పడ్డాయని ప్రధాన అరోపణ. తాజాగా ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లున్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. అనిల్ అంబానీ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు అధికారులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
రూ.3,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్ను ఇటీవలే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రిలయన్స్ పవర్ కోసం దాదాపు రూ.68.2 కోట్లకు తప్పుడు హామీ పత్రాలను అతను సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నెల 5న తమ ఎదుట హాజరుకావాల్సిందిగా అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ను కూడా ఇచ్చింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (ఫెమా) కింద అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. అనిల్ అంబానీ హాజరవుతారా లేదా వేచి చూడాలి. ఇటీవలే రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES