Wednesday, August 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీరో అంతరాయాలే మా లక్ష్యం

జీరో అంతరాయాలే మా లక్ష్యం

- Advertisement -

ఉదయం 8 గంటల నుంచే సెక్షన్‌ అధికారుల కార్యాచరణ : టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ
బస్తీల్లో పర్యటించి సమస్యల గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో

జీరో అంతరాయాలే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తోందని, దానికి తగ్గట్టుగానే ఎల్‌టీ నెట్‌వర్క్‌ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వరకు తనిఖీలు చేస్తున్నామనిదక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీ ఎస్పీడీసీఎల్‌) చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. ఎమన్నా లోపాలు ఉంటే సరిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని గతంలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నర్సింహులుతో కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని జింఖానా సెక్షన్‌ పరిధిలో పలు బస్తీలు, గల్లీల్లో కాలినడకన తిరిగి వినియోగదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్‌టీ నెట్‌వర్క్‌ను తనిఖీ చేశారు. వేలాడుతున్న తీగలు, జాయింట్లు ఉన్న కేబుల్స్‌, సరైన ఇన్సులేషన్‌ లేని హెచ్‌జీ ఫ్యుజ్‌సెట్‌లను గుర్తించి సాయంత్రం వరకు సరి చేసి తనకు ఫొటోలు పంపాల్సిందిగా విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సెక్షన్‌ అధికారులు (అసిస్టెంట్‌ ఇంజినీర్లు) ఉదయం 8 గంటల నుంచి తమ కార్యాచరణ మొదలు పెట్టాలనీ, ఏరియాల వారీగా ఎల్‌టీ నెట్‌వర్క్‌లో పోల్‌ టు పోల్‌ తనిఖీలు చేయాలనీ, ఏమైనా లోపాలు ఉంటే సరి చేయాలనీ సూచించారు. విద్యుత్‌ ఇంజినీర్లు, సిబ్బంది నిరంతర కృషి వల్ల 33 కేవీ, 11 కేవీ నెట్‌వర్క్‌లలో చాలా వరకు సమస్యలు తగ్గాయన్నారు. భారీ గాలులు, వర్షం వల్ల ఎక్కడైనా చెట్లు/ కొమ్మలు విరిగి స్తంభాలపై పడినప్పుడు విద్యుత్‌ సరఫరా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. వాటిని కూడా అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ పూర్తయ్యే వరకు తాను కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. సీఎండీ వెంట మెట్రో జోన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభాకర్‌, సికింద్రాబాద్‌ ఎస్‌ఈ గోపయ్య, డీఈ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -