నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 42.20 అడుగులుగా ఉన్న గోదావరి.. 8:15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10 గంటలకు 43.60 అడుగులు, మధ్యాహ్నం 12 గంటలకు 44.30, సాయంత్రం 3 గంటలకు 45.40, సాయంత్రం 6 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. ఎగువన ఓవైపు శ్రీరాంసాగర్ నుంచి, మరోవైపు చర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద చేరడంతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
బుధవారం రాత్రి 11 గంటలకు 48.30 అడుగులు దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు కలిసి బుధవారం భద్రాచలం చేరుకొని కరకట్ట వద్ద గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరకుండా ఉండేలా స్లూయిజ్ మోటర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్లూయిజ్ నుంచి లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తి మళ్లీ గోదావరిలో పోసేలా మోటర్లు సిద్ధం చేశారు.