– భారత పరిశ్రమలకు గడ్డుకాలమే
– యూఎస్తో చర్చల్లో మోడీ విఫలం
– తీవ్ర ఆందోళనలో ఎగుమతిదారులు
న్యూఢిల్లీ : భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లో ఉండగా.. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం అదనపు సుంకాలను మోపింది. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి అదనంగా 25 శాతం టారీఫ్లు విధిస్తూ.. ఆగస్టు 6న ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ 14329పై ట్రంప్ సంతకం చేశారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12.01 గంటల నుంచే అమల్లోకి వస్తాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ద్వారా హోమ్లాండ్ ఆఫ్ సెక్యూరిటీ విడుదల చేసిన నోటీసుల్లో వెల్లడించింది. అమెరికా చర్యలు, అధిక సుంకాలను ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ తీవ్ర విఫలమైనట్లు స్పష్టమవుతోంది. ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలే భారీగా ఉండగా.. మరో 25 శాతం పెంచడంతో ఎగుమతిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధిక సుంకాలతో టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అధిక సుంకాల నుంచి ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం వంటి రంగాలు మినహాయించబడ్డాయి. అధిక టారిఫ్ల వల్ల జీడీపీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఉద్యోగాల కల్పనను దెబ్బతీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని.. ముఖ్యంగా ఎగుమతి హబ్లలోఉద్యోగ రేట్ తీవ్రంగా తగ్గనుందని విశ్లేషిస్తున్నారు. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, సీఫుడ్ వంటి రంగాల్లో భారత ఎగుమతులు 20-30 శాతం తగ్గొచ్చని నిపుణులు, ఎజెన్సీలు అంచనా వేశాయి. ఈ పరిణామాలు కార్పొరేట్ ఆదాయాలు, బ్యాంకులు, ఐటి కంపెనీలపై ఒత్తిడి పెంచనున్నాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో విత్త లోటు పెరగనుంది.
భారత్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)లకు శరఘాతంగా మారనున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఇటీవల పేర్కొంది. యుఎస్ మార్కెట్కు వెళ్తున్న మన ఎగుమతులలో దాదాపు 55 శాతం నేరుగా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎంఎస్ఎంఈలు నడిపే అనేక రంగాలకు ఈ ఆకస్మిక వ్యయాలు, టారిఫ్ల పెరుగుదలను భరించడం సాధ్యం కాదని ఆ వర్గాల్లో కలవరం నెలకొంది. ఈ అదనపు దెబ్బ వల్ల ఎగుమతిదారులు దీర్ఘకాల క్లయింట్లను కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. యూఎస్ సుంకాలు సుమారు 47.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇది భారతదేశ ఎగుమతులలో 55 శాతానికి సమానం. అందులోనూ ఎంఎస్ఎంఈలపై అధిక ప్రభావం ఉండనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రమాదంలో జీవనోపాధి
అధిక టారిఫ్లు టెక్స్టైల్స్, మెరైన్ ఉత్పత్తులు, లెదర్ రంగాల్లోని లక్షలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్స్టైల్ తయారీలో 40 లక్షల మంది, దుస్తుల ఉత్పత్తిలో 1.11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఈ సుంకాల వల్ల ఆర్డర్లు నిలిచిపోవడానికి తోడు టారిఫ్లు పెరగడం వల్ల ఎంఎస్ఎంఈలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఆయా రంగాల్లో యూఎస్ చర్యలతో భారత్లోని లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమల్లోకి 50శాతం టారిఫ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES