నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, కల్యాణి వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. కార్మికులు తేరుకునేలోపే వరద ప్రవాహం వారిని చుట్టుముట్టింది. దీంతో బయటకు వచ్చే మార్గం లేక వారు అక్కడే ఉన్న వాటర్ ట్యాంకర్ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కామారెడ్డి పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు, ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరో నాలుగు రైళ్లను వేరే మార్గాల్లో మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధితులను ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.