- మహబూబాబాద్లో నడిరోడ్డుపై కొట్టుకున్న వైనం
నవతెలంగాణ-మహబూబాబాద్
యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ కు వచ్చిన ఇద్దరు మహిళలు తోపులాటలో ఆగ్రహానికి గురై పరస్పరం కొట్టుకున్న సంఘటన శుక్రవారం మహబూబాబాద్లో నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూరియా కోసం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు మహబూబాబాద్లోని వివేకానంద సెంటర్లో ఉన్న గ్రోమోర్ సెంటర్కి వచ్చారు. అక్కడ మహిళలు ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకొని క్యూ లైన్లో నిలుచున్నారు. పోలీసులు రావడంతో క్యూ లైన్ పెరిగి తోపులాట జరిగింది. ఇంతలో ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకుంటూ రోడ్డు మీదికి వచ్చారు. అక్కడున్న కొందరు వారిని ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు. చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈఘటన మానుకోటలో చర్చనీయాశమైంది. రైతులు, మహిళలు యూరియా కోసం వచ్చి అనేక అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద వేకువజాము నుండే రైతులు భారీ సంఖ్యలో బారులు తీరారు. బెదురు చింతల్ మల్లన్న గుడి వెనకాల నుండి వెంచర్ మీదుగా కో ఆపరేటివ్ బ్యాంకు వరకు రైతులు, మహిళా రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్ కట్టడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, కట్టడి చేశారు.