నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటు వేయకుండా నిలువరిస్తూ, ఆమె జాతీయ గుర్తింపు కార్డు(ఎన్ఐడీ)ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ఢాకాలోని నిర్బచన్ భవన్లో ఎన్నికల సంఘం కార్యదర్శి అక్తర్ అహ్మద్ ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా వెల్లడించారు.
“విదేశాల్లో తలదాచుకుంటున్న వారు ఓటు వేయాలంటే వారి ఎన్ఐడీ కార్డు యాక్టివ్గా ఉండాలి. షేక్ హసీనా ఎన్ఐడీ లాక్ చేయబడింది. కాబట్టి ఆమె ఓటు వేయలేరు” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం హసీనా మాత్రమే కాకుండా, ఆమె కుటుంబ సభ్యుల ఐడీ కార్డులను కూడా స్తంభింపజేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. హసీనా సోదరి షేక్ రెహానా, కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్తో పాటు ఇతర దగ్గరి బంధువుల ఐడీలను కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం.