విద్యార్థుల పోరాటానికి ప్రజా సంఘాల సంఘీభావం
హైదరాబాద్లో కొవ్వొత్తుల ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాను బర్తరఫ్ చేయాలి. నీట్ బాధితులకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలి.ఇంక్విలాబ్ జిందాబాద్..విద్యార్థులపై అమానుష లాఠీ చార్జీ దుర్మార్గం..నిర్భంధంతో ఉద్యమాలను ఆపలేరు..ఖబడ్దార్ మోడీ సర్కార్.. డౌన్ డౌన్ బీజేపీ సర్కార్’ అంటూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హోరెత్తింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై అమానుష లాఠీచార్జీకి నిరసనగా, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..శుక్రవారం సీఐటీయూ, ఏఐకేఎస్, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐడబ్ల్యుయూ ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, కవులు, గాయకులు, సోషల్మీడియా యాక్టివిస్టులు, విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి తల్లిదండ్రులు భాగస్వాములయ్యారు. ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్రావు, ఆమంచి నాగేశ్వర్రావు, గుమ్మడి అనురాధ,ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా,ఎమ్మెల్సీ గొరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ప్రజాకవి జయరాజు, ఎస్ఎప్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజినీకాంత్, టి నాగరాజు, డీవైఎప్ఐఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఎ వెంకటేశ్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు,ఐలూ రాష్ట్ర కార్యదర్శి పార్దసారది, సోషల్మీడియా యాక్టివిస్ ముషీర్ఖాన్, విద్యాసాగర్, నరహరి, వేణుగోపాల్ తదితరులు నిరసన కార్యక్రమంలో మాట్లాడారు.
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను మౌనంగా చూడొద్దనీ, నిశబ్దాన్ని ఛేదిద్దామంటూ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను తక్షణమే రద్దు చేసి, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల భద్రతా సమస్యలపై, విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర సర్కార్ సరైన రీతిలో వ్యవహరించాలని సూచించారు.
మోడీ మొండిగా వ్యవహరిస్తే విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా అన్ని తరగతులను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నరహంతక మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనువాద అధర్మ పాలనలో అన్ని రంగాలతోపాటు విద్యారంగాన్ని కూడా కాషాయీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా పేపర్లను పుట్నాలు అమ్మినట్టు అమ్మటమే గాకుండా..బీజేపీ పెద్దలు, మంత్రులు ఆ తప్పిదాన్ని సమర్థించుకోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శులు శ్రీకాంత్, కూరపాటి రమేష్, కె ఈశ్వర్రావు,పద్మశ్రీ, ఎస్ఎఫ్ఐ నాయకులు లెనిన్, అశోక్రెడ్డి, ఐద్వా నాయకులు రాష్ట్ర నాయకులు నాగలక్ష్మి, శశికళ, ఇందిరా, స్వరూప డివైఎఫ్ఐయ నాయకులు జావేద్, రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



