Thursday, September 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ముస్తాబైన బతుకమ్మకుంట

ముస్తాబైన బతుకమ్మకుంట

- Advertisement -

26న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
29న సరూర్‌నగర్‌ స్టేడియంలో
10 వేల మందితో బతుకమ్మ వేడుకలు
ఏర్పాట్లపై అధికారులకు సీఎస్‌ దిశా నిర్దేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రారంభోత్సవానికి బతుకమ్మకుంట ముస్తాబైంది. ఈ నెల 26న హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు, బతుకమ్మకుంట ప్రారంభ ఏర్పాట్లపై ఆయన హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి సంబంధిత అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీలకు సకాలంలో అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మకుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్‌, బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

అలాగే 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10వేలకుపైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు స్టేజీ, విద్యుదీకరణ, శానిటేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. వీటితో పాటు, 27న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివల్‌, 29న పీపుల్స్‌ ప్లాజా, 30న ట్యాంక్‌బండ్‌పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కోరారు. టెలికాన్ఫరెన్స్‌లో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ.ఆనంద్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, ఫైర్‌ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, టూరిజం శాఖ ఎండీ వల్లూరు క్రాంతి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరిచందన దాసరి, నారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -