పల్లెల్లో జోరుగా గుడుంబా తయారీ.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ – మల్హర్ రావు.
భూపాలపల్లి జిల్లా మండలంలో తాగునీరు,పాల ప్యాకేట్స్ దొరకని పల్లెలు ఉన్నాయంటే నమ్మండి,కానీ నాటు సారాయి దొరకని పల్లెలు లేవంటే అచ్చర్యానికి గురి కావాల్సిందే.మండలంలో పెద్దతూండ్ల,చిన్నతూoడ్ల, దుబ్బపేట, అడ్వాలపల్లి, శాత్రణ్ పల్లి,పాత రుద్రారం, చీపురుపల్లి, పివినగర్, తాడిచెర్ల, రావులపల్లి, నాచారం, ఆన్సాన్పల్లి, ఎడ్లపల్లి గ్రామాల్లోని వాగులు, వంకలు, గుట్టలు, ఆటవీ ప్రాంతాలు, పంట చేలల్లో గుడుంబా నిర్వాహకులు గుట్టుచప్పుడు రాత్రివేళల్లో గుడుంబా తయారీ చేసుకొని విచ్చలవిడిగా పల్లెలకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. తెల్లవారు జామున పాలు ప్యాకేట్స్ విక్రయించే వ్యాపారులు కాస్త ఆలస్యంగా రావచ్చు. కానీ నాటుసారాయి విక్రయించే నిర్వాహకులు మాత్రం వేకువజామునే గుడుంబా ప్యాకేట్స్,క్యాన్లలో సారాయి ద్విచక్రవాహనాలపై ఇంటింటా చేరవేయడం వారికి ఏళ్లుగా పరిపాటిగా మారింది.
తూతుమంత్రంగా దాడులు…
గుడుంబా తయారిని అరికట్టడానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ తూతుమంత్రంగా దాడులు చేయడంతో గుడుంబాను అరికట్టలేక పోతున్నారు.అధికారులు దాడులు చేసేముందు విక్రయదారులు సమాచారం ఇవ్వడంతో వారు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లుగా, విక్రయదారులే బహిరంగంగా చెప్పడం గమనార్హం.నిర్వాహకులు ఆబ్కారీ అధికారులకు నెలనెల మామూళ్లు సమర్పించడంతో మండలంలో గుడుంబా విచ్చలవిడిగా నడుస్తోందనే అపవాదు ఉంది. మరో రెండు రోజుల్లో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో నాటుసారను భారీగా పట్టణాలకు తరలించడానికి గుడుంబా తయారీ దారులు ఇప్పటికే ఆడ్వాన్స్ గా వేలాది లీటర్లలో చెక్కర,బెల్లం, పటిక పానకం పులియ వేశారు పల్లెల్లో సాధారణ రోజుల కంటే గిరాకీ ఎక్కువగా ఉండటంతో ముందస్తుగా జోరుగా గుడుంబా తయారు చేస్తున్నారు. బెల్లం దొరకని ప్రాంతాల్లో చక్కరతో తయారు చేస్తున్నారు.
చెక్కర,బెల్లం,పటిక దిగుమతి..
గుడుంబా తయారీకి వినియోగించే చెక్కర,బెల్లం, పటికను కామారెడ్డి, ఛత్తీస్ గడ్ ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి చేసుకొని తాడిచెర్ల, కొయ్యూర్, రుద్రారం,మల్లారం గ్రామాల్లో కొందరు కిరాణ వ్యాపారులు విక్రయి స్తున్నట్లు తెలుస్తోంది. బెల్లం దొరకని ప్రాంతాల్లో చక్కెరతో తయారు చేస్తున్నారు.దసరా నేపథ్యంలో భారీగా చెక్కర,బెల్లం, పటిక దుకాణాల్లో రహస్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.