సహాయక చర్యలకు రంగంలోకి దిగిన భారత సైన్యం
నేపాల్లోనూ భారీ వర్షాలు
థింపు : కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండ డంతో పొరుగుదేశం భూటాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వారికి సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. భూటాన్ అధికారులు, భారత సైనికులు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భూటాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా బాధితులను తరలిస్తున్న భూటాన్ హెలికాప్టర్ పని చేయక పోవడంతో ఆ దేశం భారత్ను అత్యవసరం సాయం కోరిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
వెంటనే స్పందించిన భారత్ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించి.. వారికి తక్షణ వైద్య సహాయం అందేలా రెండు హెలికాప్టర్లను మోహరించిందని తెలిపాయి.మరోవైపు నేపాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో తూర్పు నేపాల్లో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్లోని పలు జిల్లాలు అతలాకుతల మయ్యాయి. కొండచరియలు విరిగి పడటం, ఆకస్మిక వరదలు, రహదారులు బ్లాక్ కావడంతో పాటు వంతెనలు కొట్టుకు పోయాయని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనల్లో సుమారు 22మంది మరణించారని అన్నారు. భారత్కు తూర్పు సరిహద్దుగా ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడి 18 మంది మరణిం చారని పోలీస్ ప్రతినిధి బినోద్ తెలిపారు.
దక్షిణ నేపాల్లో పిడుగులు పడి ముగ్గురు మరణించగా, తూర్పు నేపాల్లోని ఉదరుపూర్ జిల్లాలో వరదల కారణంగా ఒకరు మరణించారని అన్నారు. ఆగేయ నేపాల్లోని కోషి నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోందన్నారు. నదిలో నీటి ప్రవాహం సాధారణం కన్నా రెండింతలు ఉన్నట్టు తెలిపారు. 56 సూయిజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు.వరదల్లో శనివారం 11మంది కొట్టుకు పోయారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎంఎ) ప్రతినిధి శాంతి మహత్ తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో రహ దారులు బ్లాక్ అయ్యాయని, వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారన్నారు. వర్షాలకు దేశీయ విమానాలు తీవ్రంగా ప్రభావితమ య్యాయ న్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.