నవతెలంగాణ-హైదరాబాద్: కరూర్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం చెన్నై పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆయన ఇంటిని బాంబుతో పేల్చేస్తానని బెదిరించారు. ఈ బెదిరింపు కాల్తో అప్రమత్తమైన చెన్నై పోలీసులు విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ కన్యాకుమారి నుంచి వచ్చినట్లు గుర్తించారు.
కాగా, కరూర్ ఘటన తర్వాత విజయ్కి ఇలా బెదిరింపులు రావడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. విజయ్తోపాటూ ఇటీవలే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాటతో విజయ్పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి.