నవతెలంగాణ – హైదరాబాద్: కళారంగంలో విశేష కృషి చేసిన ప్రతిభావంతులను తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను “కలైమామణి” పురస్కారాలను ప్రదానం చేశారు. మొత్తం 90 మంది కళాకారులు వివిధ విభాగాలలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను నటనా విభాగంలో ప్రముఖ నటి సాయిపల్లవి ఈ పురస్కారానికి ఎంపిక కాగా, ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఆమెకు అవార్డును అందజేశారు.
అలాగే, నటులు ఎస్.జే. సూర్య, విక్రమ్ ప్రభు తదితరులు కూడా పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. సంగీతం, నృత్యం, నాటకం, సినిమా వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. కలైమామణి పురస్కారం తమిళనాడులో కళారంగానికిచ్చే అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఈ పురస్కారాల ద్వారా కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.