ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్’. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. నైన్టీస్ వెబ్ సిరీస్ దర్శ కుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్లో జరిగిన ‘ఎపిక్’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చు తాయి. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఇదొక అందమైన ప్రేమ కథ’ అని కథానాయిక వైష్ణవి చైతన్య చెప్పారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ. కథ రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని నమ్మాను. చిత్ర విజయం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం’ అని అన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.



