విద్యార్థినిపై కామాంధుడి కన్ను గర్భవతి అయిన విద్యార్థిని

విద్యార్థినిపై కామాంధుడి కన్ను గర్భవతి అయిన విద్యార్థిని– అబార్షన్‌ చేయించడంతో పరిస్థితి విషమం
– నిందితుడి అరెస్టు, రిమాండ్‌
– రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన
నవతెలంగాణ-చేవెళ్ల
పదో తరగతి విద్యార్థినిపై కన్నేసిన ఓ కామాంధుడు.. ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్‌ చేయించడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. దాంతో బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన కోజ్జంకి సుదర్శన్‌ అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(17)పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని బాలికను స్కూల్‌లో దింపుతానని చెప్పి తన కారులో ఎక్కించుకుని పాఠశాలలో దింపాడు. దాంతో అతన్ని నమ్మిన బాలిక పలుమార్లు అతనితో వెళ్లింది. ఒక రోజు చేవెళ్ల పరిధిలోని నిర్మానుష ప్రదేశానికి బాలికను తీసుకెళ్లిన నిందితుడు.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఓ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించడంతో ఆమె అనారోగ్యానికి గురైంది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్ధిని గాంధీ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బాలిక తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడు ఉపయోగించిన కారునూ సీజ్‌ చేశారు. ఇదిలా ఉండగా నిందితుడు సుదర్శన్‌కు గతంలోనే పెండ్లి కాగా ఒక కుమారుడు ఉన్నాడు.

Spread the love