ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ – రాయపోల్

మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి మల్లేశం (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఐదు సంవత్సరాల క్రితం మల్లేశం భార్య కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు నర్సింలు, గణేష్ ఉండగా హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య చనిపోయిన నాటినుంచి మల్లేశంకు మద్యం సేవించడం అలవాటయింది. కుటుంబ సభ్యులు మద్యం సేవించడం ఆపేయాలని వారు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం పెద్ద కుమారుడు కిచ్చుగారి నర్సింలు మేడ్చల్ నుండి సొంత గ్రామం రాంసాగర్ వచ్చారు. తండ్రి కొడుకులు రాత్రి 10:00 సమయం వరకు మాట్లాడుకొని కొడుకు నర్సింలు పెదనాన్న ఇంటిదగ్గర పడుకోవడానికి వెళ్ళాడు. ఉదయం నిద్రలేచి ఇంటికి వచ్చిచూసేసరికి వారి తండ్రి మల్లేశం ఇంటి తలుపులు తెరవలేదు. ఎన్నిసార్లు పిలిచినప్పటికీ తెరవకపోయేసరికి అనుమానంతో కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి మల్లేశం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్టి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసై ఉరివేసుకొని మల్లేశం మృతి చెందాడని మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోలు ఎస్సై రఘుపతి తెలిపారు.
Spread the love