– దేశంలో శాంతి భద్రతలపై అనుమానాలు
– జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, అమర్నాథ్ యాత్రపై ప్రభావం
– రాజకీయ విశ్లేషకులు, నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడులు కొత్తగా ఏర్పడిన మోడీ ప్రభుత్వానికి సవాల్గా పరిణమించాయి. అంతేకాదు, జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, అమర్నాథ్ యాత్రల పైనా ఇవి ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈనెల 9న ఒక పర్యా టకులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై ఉగ్రవాదు లు కాల్పులు జరపటంతో తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రదాడుల కలకలం దేశంలోని భద్రతను ప్రశ్నార్థకంగా మార్చిందనీ, కొత్తగా ఏర్పడిన మోడీ సర్కారుకు ఇది అతిపెద్ద సవాలు అని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు.
ప్రధాని మోడీ.. ఎన్నికల సమయంలో కాశ్మీర్లో ఓటింగ్ శాతాన్ని తన పదవీకాలంలో అత్యంత సంతోషకరమైన విషయంగా అభివర్ణించారు. ఆర్టికల్ 370ని తన ప్రభుత్వం ప్రభావవంతంగా రద్దు చేసినందున ఇక్కడ ఇక ఎన్నికలు రావచ్చనే ఆశలను ఆయన రేకెత్తించారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు సుప్రీంకోర్టు గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన అన్నారు.
జమ్మూలోని రియాసిలో పౌర రవాణా బస్సుపై ఇప్పటివరకు జరిగిన మూడు దాడుల్లో మొదటిది.. జూన్ 9న రాత్రి 7 గంటల సమయంలో, రాష్ట్రపతి భవన్లో మోడీ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే జరిగింది. ఆ వేడుక జరిగినంత కాలం టెలివిజన్ ఛానెల్లు ఈ దాడికి సంబంధించిన వార్తను ప్రసారం చేయలేదు. కానీ సోషల్ మీడియాలో, కత్రాకు వెళ్లే యాత్రికులు ఉన్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారనే వార్తలు వేగంగా వ్యాపించాయి. డ్రైవర్పై కాల్పులు జరగటంతో.. బస్సు కింద ఉన్న లోయలో పడి తొమ్మిది మంది మృతి చెందారు. అయితే, దాడి వెనుక ఉన్నవారు మోడీ ప్రమాణ స్వీకా రోత్సవం సమయంలోనే శాంతి భద్రతలపై సవాలు విసిరారని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో నెలకొని ఉన్న శాంతి తాత్కాలికమనీ, దేశంలో అలజడులు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా చెలరేగచ్చన్న అనుమానాలను కొట్టిపారేయలేమనీ, ఇందుకు రియాసి ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తున్నారు.
2019 నుంచి కాశ్మీర్లో భద్రతను పెంచటంతో కావచ్చు, మతపరమైన రూపకల్పన కారణంగా.. ఉగ్రవాదులు తమ దృష్టిని జమ్మూ వైపు మళ్లించినట్టు సమాచారం. 2021 నుంచి ఈ ప్రాంతం, ముఖ్యంగా రెండు సరిహద్దు జిల్లాలైన రాజౌరి, పూంచ్లు ఘోరమైన ఉగ్రవాద సంఘటనలను చూశాయి. భద్రతా దళాలకు 2023 ఏడాది ఈ ప్రాంతంలో భయంకరమైనదిగా మిగిలింది. ఆ ఏడాది ఐదు దాడులతో 20 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక గుజార్ జనాభాలో కొందరు ీమాంతర ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించడంలో నిమగమై ఉన్నారనే అనుమానం, పూంచ్లో ఆర్మీ సిబ్బంది పౌరులను చిత్రహింసలకు గురిచేయడానికి దారితీసింది.
అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో మే 25న ఎన్నికలు జరగనున్న తరుణంలో తాజాగా మూడు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 22న రాజౌరిలోని కుంట టాప్లో ఆర్మీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అదే రోజు, ఉధంపూర్లోని బసంత్గఢ్ ప్రాంతంలో ఒక గ్రామ రక్షణ గార్డు మరణించాడు. మే 2న, పూంచ్లోని సురన్కోట్ ప్రాంతంలో భారత వైమానిక దళం కాన్వారుపై దాడి జరిగింది. ఇందులో ఒక అధికారి మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రవాదులు జమ్మూలో మరింత లోతుగా చొచ్చుకుపోయారనీ, వారు తమ ఉనికి కోసం తీవ్రంగా పని చేస్తున్నారని విశ్లేషకులు అంటు న్నారు. కాగా, సాధారణంగా జులైలో ప్రారంభ మయ్యే అమర్నాథ్ యాత్రకు ఈ దాడులు భద్రతాపరమైన సవాళ్లను విసురుతాయని చెప్తు న్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు సుప్రీం కోర్టు నిర్దేశించిన సెప్టెంబర్ చివరి గడువులోగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పునః పరిశీలనకు దారితీస్తాయో, లేదో వేచి చూడా ల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే, ఇది కొత్తగా ఏర్పడిన మోడీ ప్రభుత్వానికి, కాశ్మీర్కు చెందిన ముగ్గురు ఎంపీలకు ఒక పరీక్షగా మారిందని అంటున్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఇది ప్రధానాంశంగా మారుతుందని వారు చెప్తున్నారు.