మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం తర్వాతే, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం క్యాబినెట్కు చేరుతుంది
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు : ఇష్టాగోష్టిలో మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం సాధ్యంకాదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆ భూములను ఉచితంగా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా రద్దు చేస్తే ప్రభుత్వమే ఆ డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని గుర్తు చేశారు. అది సాధ్యమయ్యే పనికాదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం చేసిన తర్వాతే, రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉపసంఘంలోని మంత్రులు కొంత బిజీగా ఉండటంతో సమావేశం కాలేదని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన విలేకర్లతో మంత్రి ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. త్వరలో తహసీల్దార్ బదిలీలు ఉంటాయన్నారు. ఏడాదిన్నరలో 90శాతం గ్రామాల సర్వే పూర్తి అవుతుందని చెప్పారు.
రెవెన్యూలో అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, అందుకే ఏసీబీ దాడులను ముమ్మరం చేశామన్నారు. మొదటి దశ లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లష్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రయివేటు నిర్మాణ సంస్ధలతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణంతో పాటు ఐదేండ్ల నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్ధలకే అప్పగించినట్టు తెలిపారు. మూడు నుంచి ఐదు ఎకరాల స్ధలంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజీ హాల్, గర్బిణీలకు, వృద్దులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియా మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవానలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ గచ్చిబౌలి లో నిర్మిస్తున్న భవనాన్ని డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో శంకుస్థాపన చేయబోతున్నామని గుర్తు చేశారు. రెండవ విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామన్నారు.
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచం
ఒక్క శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందనే ఆలోచనతో వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్ ల అధికారాలను కుదించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎకరానికి 5 లక్షలుగా, హెచ్ఎండీఏ పరిధిలో 10 లక్షలుగా, ఓ.ఆర్.ఆర్. పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే సమీక్షిస్తామని తెలిపారు. సవరించిన భూముల విలువలు, సందేహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్స్ యాప్ నెంబర్ 8247619983 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మంత్రుల శాఖాల మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ‘తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. దేవుడి దయతో ఇంతవరకు వచ్చాను.
నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసే వ్యక్తిని కాను. ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదు. చట్ట ప్రకారం పనిచేస్తున్నాను. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డవారిపై, ఎ.సి.బీ. ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారు. మూడు, నాలుగేండ్ల పాటు ఫైళ్లను తొక్కిపెట్టారు. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేసాను. తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఎవర్ని క్షమించలేదు, ఉపేక్షించలేదు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పదేండ్లు గడిచిన కూడా ఆ నాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదు. అడిగిన సభ్యుల పదవి కాలం కూడా ముగిసింది. ఇటీవల అన్నీ ఫైళ్లను క్లియర్ చేశాను. గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేదిత జాబితాలో పెట్టింది. భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ను డిజిటలైజేషన్ చేస్తాం’ అని చెప్పారు.



