– సీఎం రేవంత్ విదేశీ పర్యటన జయప్రదం
– ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించామన్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన జయప్రదమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు పెట్టుబడులు భారీగా వెల్లువెత్తాయని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. రేవంత్ బృందం మొత్తం 25 కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా, రూ.36 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తెలిపింది. రేవంత్ అమెరికా పర్యటనలో రూ.31,502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే రకమైన స్పందన వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రూ.4,500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో కలిపి మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. ఫలితంగా ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
కాగా సీఎం రేవంత్ గత జనవరిలో దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రంలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో రూ.36 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రూ.76,232 కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకున్న ప్రభుత్వం సరికొత్త రికార్డును నమోదు చేసింది. తద్వారా దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
కంపెనీలకు సీఎం భరోసా…
దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రధానంగా అటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది. ఆయా రంగాల్లో దక్షిణ కొరియాకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో సీఎంతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చర్చలు, సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు తమ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. దీంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది.
గ్లోబల్ హబ్గా హైదరాబాద్
సీఎం చర్చలతో హ్యుందారు మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయటం ద్వారా గ్లోబల్ హబ్గా ఎంచుకుంటామని ప్రకటించింది. కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులో ఉంటుందంటూ ఆ సంస్థ సంతృప్తిని వ్యక్తం చేసింది.
ఫ్యాషన్ సిటీకి పదెకరాల కేటాయింపు
వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్రమలను నెలకొల్పుతున్న యంగ్వన్ కంపెనీ హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకు అవసరమయ్యే పదెకరాల స్థలాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సమ్మతిని తెలుపుతూ ఆయన ఒక లేఖను యంగ్వన్ కంపెనీ చైర్మెన్కు అందజేశారు.
‘కాస్మొటిక్స్’కు పరస్పర సహకారం
కాస్మొటిక్స్ ఇండిస్టీలో దక్షిణ కొరియాకు ప్రత్యేక స్థానముంది. ఆ రంగంలో పేరొందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి అక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాస్మొటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా పరస్పర సహకారాన్ని ఆయన కోరారు. తెలంగాణలో వీటి తయారీకి ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొరియన్ బ్యూటీ ఇండిస్టీ ట్రేడ్ అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇతర కంపెనీల ప్రణాళికలు…
ఇదే సందర్భంగా మరో మూడు కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి. డాంగ్బాంగ్ ఫార్మా కంపెనీ రూ. 200 కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని ప్రకటించింది. జేఐ టెక్ కంపెనీ ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్తోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ఆ సంస్థ ప్రకటించింది. చావి కంపెనీ హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
చర్చలు.. భవిష్యత్ ప్రణాళికలు…
ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శ్యామ్సంగ్, సీ అండ్ టీ, శ్యామ్సంగ్ హెల్త్కేర్, క్రాఫ్టన్, యూయూ ఫార్మా, జీఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఎంచుకోవాలని సీఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
తమ పర్యటనలో భాగంగా కొరియాలోని చెంగియీచియోన్ స్ట్రీమ్ రీడెవలప్మెంట్, హాన్ రివర్ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. అక్కడ అనుసరించిన కొన్ని అద్భుతమైన నమూనాలను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల అభివృద్ధికి అనుసరించిన విధానాలు, వాటిని నిర్వహిస్తున్న తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఇటీవల నిర్వహించిన ఒలింపిక్స్లో విజేతలైన వారిలో ఎంతోమందిని ఆ వర్సిటీ తీర్చిదిద్దింది. మన రాష్ట్రంలోనూ అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం యోచిస్తున్నారు.