నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టబధ్రుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ లలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు.అలాగే ఎం ఎల్ సి ఓట్ల లెక్కింపు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాంలో ఏర్పాటు చేయనున్న ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు.ఈనెల 27న శాసనమండలి పట్టబధ్రుల ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న దృష్ట్యా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచేందుకు ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్స్ లతోపాటు, పోస్టల్ బ్యాలెట్ బాక్సులు, అలాగే స్టాచుటరి మెటీరియల్ సైతం స్ట్రాంగ్ రూములలో భద్రపరిచేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల నుండి వచ్చే బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచేందుకు వాహనాలు వచ్చేందుకు ప్రత్యేక దారి ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ సందర్భంగ బారికేడింగ్ తో పాటు కూలర్లు, తాగునీరు, టెంట్లు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్డిఓ నాగిరెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, డిఎస్పి శివశంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.