– అశ్వారావుపేట లో కేసు నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సెప్టెంబర్ 14 న అశ్వారావుపేట బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెక్కిన 21 ఏళ్ల యువతి పోడియం నందిని అదృశ్యమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి తల్లి మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై యయాతి రాజు కేసు నమోదు చేసి, నందిని ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రామన్నపాలెం కాలనీకి చెందిన నందిని హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
నందిని ఆగస్టు 30న తల్లి మల్లేశ్వరి తో కలిసి స్వగ్రామానికి వచ్చింది. అనంతరం మల్లేశ్వరి హైదరాబాద్ కు తిరిగి వెళ్లింది. సెప్టెంబర్ 14 న నందిని పిన్ని ఆమెను అశ్వారావుపేట బస్టాండ్ కు తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించింది. అయితే నందిని హైదరాబాద్ చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నందిని ఆచూకీ తెలిసిన వారు ఎస్సై యయాతి రాజు ఫోన్ నంబర్ 8712682062 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.



