– దృష్టి సారించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు
– ముమ్మరం చేసిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జరుగుతున్న ఎన్రోల్మెంట్ డిజిటలైజేషన్ ప్రక్రియలో అశ్వారావుపేట వెనుకంజలో ఉండటంతో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్ఆర్ నగర్లో నిర్వహించిన ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు, బాధ్యత అని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గణన దరఖాస్తు (ఎన్యూమరేషన్ ఫారం)ను నింపి ఎన్రోల్మెంట్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఫారాలు తీసుకోని వారు స్థానిక ప్రజాప్రతినిధులు లేదా సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి వెంటనే ఫారాలు పొందాలని సూచించారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్ను వేగవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ విభాగం డీటీ సయ్యద్ హుస్సేన్, వార్డు కౌన్సిలర్లు జినుగు రవి, మిండా హరిబాబు, నార్లపాటి మౌనిక, నార్లపాటి దివాకర్, ఎస్.కె. నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.



