అసోంలో దారుణం

అసోంలో దారుణం– ట్రక్కు, బస్సు ఢ.. 12 మంది మృతి
– మరో 30 మందికి గాయాలు
– గోలాఘాట్‌లో ఘటన
గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో దారుణం చోటు చేసుకున్నది. బొగ్గుతో కూడిన ట్రక్కు, ప్రయాణీకుల వెళ్తున్న బస్సు ఢకొీని 12 మంది మృతి చెందారు. 30 మంది వరకు గాయపడ్డారు. బుధవారం ఉదయం గోలాఘాట్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బాధితులు, పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్కువగా బరలుఖువా గ్రామానికి చెందినవారున్నారు. అసోంలోని తిన్సుకియా పట్టణంలోని తిలింగ మందిర్‌కు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు వెంటనే మరణించారు. గాయపడిన వారిలో కొందరు డెర్గావ్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, తీవ్ర గాయాలపాలైన వ్యక్తులు జోర్హాట్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందజేయనున్నారు.
క్షతగాత్రులకు అవసరమైన సహాయాన్ని స్థానిక యంత్రాంగం అందిస్తున్నదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ” జాతీయ రహదారి ఒక భాగానికి మరమతులు జరుగుతున్నాయి. దీంతో రెండు వైపులా ప్రయాణించే వాహనాలు డివైడర్‌కు ఒక వైపు మాత్రమే రహదారిని ఉపయోగిస్తాయి. అతి వేగంతో వస్తున్న ట్రక్కు.. బస్సును ఢకొీట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు” అని గోలాఘాట్‌ డిప్యూటీ కమిషనర్‌ పి. ఉదరు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి ర్యాష్‌, నిర్లక్ష్యం డ్రైవింగ్‌ కారణంగా మరణం కేసు నమోదు చేసినట్టు గోలాఘాట్‌ పోలీసు సూపరింటెండెంట్‌ రాజేన్‌ సింగ్‌ తెలిపారు.

Spread the love