ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ని సొంతం చేసుకునే కథానాయికలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క. తన అందం, అభినయం, విజయపరంపరతో హీరోలకు సమానంగా బ్రాండ్ ఇమేజ్ని దక్కించుకుంది. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు ‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్తో మెప్పించడం ఒక్క అనుష్కకే సాధ్యమైంది. ‘వేదం’ సినిమాలో సరోజ క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘అరుంధతి, వేదం, రుద్రమదేవి’ సినిమాల్లోని నటనకు ‘ఫిలిమ్ ఫేర్’ పురస్కారాలు వరించాయి. ‘బాహుబలి సినిమాలోని ‘దేవసేన’ పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు.2021లో విడుదలైన ‘నిశ్శబ్దం’ ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. ఇందులో భాగంగా ఆమె బర్త్డే కానుకగా అనుష్క 50వ సినిమా ‘భాగమతి-2’ని యూవీ క్రియేషన్స్లో భారీగా ప్లాన్ చేయటం విశేషం.