బీజేపీని తరిమికొట్టాలి

బీజేపీని తరిమికొట్టాలి– కార్మిక, కర్షక మహాపడావ్‌ విజయవంతం
– గొంతెత్తిన కార్మిక, రైతులకు అభినందనలు
– భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తాం : రైతు, కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ప్రజలను, దేశాన్ని రక్షించడానికి బీజేపీని అధికారం నుంచి తరిమి కొట్టాలని ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపడావ్‌’ పిలుపు నిచ్చింది. మోడీ సర్కార్‌ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా మూడు రోజుల మహాపడావ్‌ విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక మహాపడావ్‌ను విజయవంతం చేసినందుకు కార్మికులు, రైతులకు కార్మిక, రైతు సంఘాలు అభినందనలు తెలిపాయి. అనేక రాష్ట్రాల్లో ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపడావ్‌’ ప్రజా ఉద్యమంగా మారింది. రాజ్‌భవన్‌కు చేరుకుని ఆయా గవర్నర్‌లకు మెమోరాండం, చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్‌లను సమర్పించడం తో మహాపడావ్‌ పోరాటం ముగిసింది.
రైతు, కార్మిక నేతలపై కేసులు నమోదు చేసి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, మూడు రోజుల పాటు మహాపడావ్‌ను విజయవంతం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సెక్టోరల్‌ ఫెడరేషన్లు/సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా సంయుక్త వేదిక 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు విజయవంతంగా జరిగిన మహాపడవ్‌లో లక్షల మంది పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అనేక మంది మేధావులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులు మహాపడవ్‌కు సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం)తో పాటు వివిధ పార్టీలు కూడా మహాపడవ్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో మహాపడవ్‌ రాజకీయ ప్రాముఖ్యతను సూచిస్తుంది.
అండమాన్‌ నికోబార్‌ రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌, త్రిపురలోని అగర్తల, పాండిచ్చేరితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధాని నగరాల్లో రాజ్‌ భవన్‌ (గవర్నర్‌ కార్యాలయం)ల ఎదుట మూడు రోజుల పాటు మహాపడావ్‌ నిర్విరామంగా జరిగింది. మూడు రోజులు ఆందోళనా కేంద్రాల వద్దే వంటావార్పు చేసుకొని, తాత్కాలిక గుడారాలు ఏర్పాటుచేసుకొని రాత్రుళ్ళు కూడా అక్కడే బసచేశారు.
స్వామినాథన్‌ కమిషన్‌ ఫార్ములా ప్రకారం రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనీ, ఆందోళనలో అమరులైన రైతులకు పరిహారం ఇవ్వాలనీ, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లఖింపూర్‌ ఖేరీ హత్యలు, హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణ, నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయడం, కార్పొరేట్‌ దోపిడీకి ముగింపు, మంజూరైన పోస్టుల భర్తీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, పెరిగిన ధరలను ఉపసంహరించు కోవడం నిత్యావసర వస్తువులపై, నాణ్యమైన, ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, నీరు, ప్రాథమిక పౌర సౌకర్యాలు మొదలైన డిమాండ్ల సాధనకు మహా పడావ్‌ జరిగింది.
ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి ప్రభుత్వ సంస్థల సహాయంతో యూఏపీఏ, దేశద్రోహ చట్టం వంటి నీచమైన చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించి నందుకు రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష సభ్యులను టార్గెట్‌ చేస్తుందని విమర్శించింది. చారిత్రాత్మక రైతు పోరాటంపై వాస్తవాల ను ప్రచురించిన న్యూస్‌క్లిక్‌ మీడియా ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తిలను కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిందని విమర్శించింది. ఇది భయానక వాతావరణాన్ని సృష్టించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలను విధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ప్రజల డిమాండ్లపై మరింత భారీ, ఐక్య పోరాటాలు చేస్తామని రైతు, కార్మిక సఘాలు హెచ్చరించాయి.
మహాపడవ్‌ కార్యక్రమాలను సమీక్షించిన అనంతరం స్వతంత్రంగా, సమన్వయంతో తదుపరి దశ ఆందోళనలను నిర్ణయిస్తామని (కేంద్ర కార్మిక సంఘాలు) సీటీయూఎస్‌, ఎస్‌కేఎం నాయకులు తెలిపారు.
ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ నయా ఉదారవాద విధానాల వ్యవస్థాగత సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలని కార్మికులు, రైతులు కోరుతున్నారని అన్నారు. మన జాతీయ సంపదను సృష్టించి, జాతీయ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న సామాన్య ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు పెట్టాలన్నారు. వేతనాలు పెంచడం, ప్రభుత్వ నిధులతో సామాజిక భద్రతా చర్యలను విస్తరించడం, విశ్వవ్యాప్తం చేయడం, వ్యవసాయ ఇన్‌పుట్‌లతో సహా రైతులకు సబ్సిడీ, ప్రభుత్వ యాజమాన్యంలోని మండీలు, తగిన ఎంఎస్పి మొదలైన ఇతర చర్యలు రైతుల కష్టాలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌, ఏఐసీసీటీయూ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ దిమ్రి, ఏఐకేఎస్‌ కోశాధికారి కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో తపన్‌ సేన్‌ (సీఐటీయూ), అశోక్‌ సింగ్‌ (ఐఎన్టీయూసీ), ఏఆర్‌ సింధు (సీఐటీయూ), ఆర్‌ కె శర్మ (ఏఐయూటీయూసీ), షణ్ముగమ్‌ (ఎల్పీఎఫ్‌), మనలి (ఎస్‌ఈడబ్ల్యూఏ), ఆశోక్‌ ఘోష్‌ (యూటీయూసీ), ఇందుప్రకాష్‌ మీనన్‌ (టీయూసీసీ), ఎస్‌కేఎం నేతలు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌, హన్నన్‌ మొల్లా, రాకేష్‌ టికాయిత్‌, దర్షన్‌ పాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌, సునీలం, అవిక్‌ సాహా తదితరులు పాల్గొన్నారు.

Spread the love