నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ, స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి ఏడుగురు మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు.
కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సుమారు ఏడు రోజుల క్రితం ఒక బోటులో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని వస్తున్న క్రమంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తూ ఇసుక దిబ్బను ఢీకొట్టి సముద్రంలో బోల్తా పడింది. దీంతో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు.
సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తూ చేసిన ఆర్తనాదాలను చిన్నలంక గ్రామస్తులు విన్నారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టి, ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు బాధితులను చిన్నలంకలోని పునరావాస కేంద్రానికి తరలించి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.



