గుజరాత్లో 22 మంది చిన్నారులు మృతి
గుజరాత్ : మరో కొత్త వైరస్ వెలుగులోకొచ్చింది. చిన్నారుల ప్రాణాలు తీస్తోంది. ఈ అరుదైన వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతి చెందగా, మరి కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజారాత్ లో ‘చాందీపుర్ వైరస్’ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 184 మందికి పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. గుజరాత్ లో ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. మరో 11 నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. పాజిటివ్ నిర్ధారణ అయిన ఏడుగురు పిల్లలు రాష్ట్రంలోని వివిధ సివిల్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గాంధీనగర్, సబర్కాంత-హిమ్మత్నగర్, పటాన్, రాజ్కోట్, భావ్నగర్ ఆస్పత్రుల్లో చేరిన చిన్నారులకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. అయితే, ఈ వైరస్ బారినపడినవారంతా15 ఏండ్ల లోపు వారుగా గుర్తించారు.అయితే..ఈ కేసులు నిర్దిష్టంగా ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి. ఇసుక ఈగలు ఈ వైరస్కు ప్రధాన వాహకాలు కావడంతో, పశువులు పెంచే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. మట్టి ఇండ్ల గోడల పగుళ్లను మూసివేయాలని ప్రజలకు సూచించారు. ఈ వైరస్ లక్షణాల పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా అధిక జ్వరం, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఆక్సిజన్ తో పాటుగా వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఐసీయూలో చేర్పించాలని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులను ఆదేశించారు. ప్రభుత్వం ఈ వైరస్ పైన అవగాహన పెంచే చర్యలు చేపట్టింది. దీంతో.. ఇప్పుడు ఈ వైరస్ పై ఆందోళన పెరుగుతోంది.
చాందీపుర వైరస్ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



