తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో ఎదురైన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను అధిగమించిన అడ్డంకులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ స్వయం పాలనకు 9ఏళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి వెళ్తున్నామన్నారు. అనుమానాలు పటాపంచలు చేస్తూ అద్భుతంగా నిలదొక్కుకున్నామన్నారు. ప్రత్యర్థుల కుయుక్తులు తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని చెప్పారు. వెనుకబాటుతనానికి గురైన తెలంగాణ నేడు దేశాన్ని ముందుకుతీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో విజయం సాధించామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలువడం సంతృప్తికరంగా ఉందన్నారు. ‘తెలంగాణ మోడల్‌’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు పొందడం మన ఘన విజయమని, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు.

Spread the love