నవతెలంగాణ-హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. దాదాపు అరగంటపాటు ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం వెంట లోక్సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన లోక్సభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి దిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు దిల్లీలో ఉండనున్న రేవంత్.. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో సమావేశమై.. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.