హాస్టళ్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో టీజీ సేఫ్ తనిఖీల్లో వెల్లడి
పది బృందాలతో 20 కేంద్రాల్లో సోదాలు
కూకట్పల్లిలోని పలు హాస్టళ్లు, హోటళ్లు సీజ్..మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో ఆహార భద్రతా అధికారులు, పోలీసులతో కూడిన పది బృందాలు కూకట్పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు మొదలైన వివిధ ఆహార సంస్థల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాయి. పలు హాస్టళ్లు, హోటళ్లలో ఆహారం తయారు చేసే ప్రాంతాల్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుండటాన్ని, ఫ్రిజుల్లో పాడైపోయిన కూరగయాలు, కుళ్లిపోయిన మాంసాహారాలను బృందాలు గుర్తించాయి. వాటికి సంబంధించిన ప్యాప్సీ గుర్తింపును రద్దు చేసి సీజ్ చేశారు. బుధవారం తనిఖీ చేసిన వాటిలో దాదుస్ మిఠై వాటికా, గుమ్మడి ఆహారాలు, పారడైజ్ ఫుడ్ కోర్ట్, కేఎస్ బేకర్స్, చైతన్య ఫుడ్ కోర్టు, గోదావరి మిఠాయి, మణికంఠ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్, కేఎస్ పురుషుల పీజీ హాస్టల్, జీవీకే న్యూ లగ్జరీ పీజీ పురుషుల హాస్టల్, హోటల్ సితార గ్రాండ్, మెహ్ఫిల్ రెస్టారెంట్, శ్రీ కన్యా కంఫర్ట్ రెస్టారెంట్, బేక్ మ్యాక్స్ ఫుడ్స్ ప్రయివేటు లిమిటెడ్ (బ్రౌన్ బేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్), మండి కైండ్ అరేబియన్ రెస్టారెంట్, కూకట్పల్లి మండి, భూలక్ష్మి మెస్, శ్రీ హర్ష డీలక్స్ మెస్ ఉన్నాయి. తనిఖీ సమయంలో కొన్ని సంస్థలలో ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆహార కల్తీ జరిగినట్లు అనుమానంతో 20 నమూనాలను సేకరించారు.
జీవీకే న్యూ లగ్జరీ మెన్స్ హాస్టల్ను ఫ్యాప్సీ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నట్టు గుర్తించి సీజ్ చేశారు. తనిఖీ సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడం కోసం గుమ్మడి ఫుడ్స్లోని శ్రీ మహాలక్ష్మి కేంద్రం, KS బేకర్స్, లక్ష్మి వెంకమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, మెహఫిల్ రెస్టారెంట్, శ్రీ హర్ష డీలక్స్ మెస్లకు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రతా నిబంధనల పాటింపు స్థితిని ధ్రువీకరించడానికి ఆ సంస్థల్లో మళ్లీ తనిఖీలు చేపట్టనున్నారు. మెస్సర్స్ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, చైతన్య ఫుడ్ కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయిలకు షో కాజ్ నోటీసులు అందజేశారు. మెస్సర్స్ మణికంఠ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్లో అధిక బొద్దింకల బెడద, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన వేరుశెనగలు మొదలైన వాటిని గుర్తించారు. వెంటనే ఆ ఆహారపదార్థాలను అధికారులు పారబోయించారు. మెస్సర్స్ శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్లో అధిక బొద్దింకల బెడద, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన ప్రాంగణం, సరైన రికార్డుల నిర్వహణ లేకపోవడం వంటి వాటిని గుర్తించారు. మెస్సర్స్ హోటల్ సితారా గ్రాండ్లో బొద్దింకలు, ఎలుకల బెడద, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు, రిఫ్రిజిరేటర్ల సరైన నిర్వహణ లేకపోవడం మొదలైన వాటిని గుర్తించారు. మెస్సర్స్ బేక్ మాక్స్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రౌన్ బేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్) లో బొద్దింకలు, ఈగల బెడద, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైపోయిన కూరగాయలు, అపరిశుభ్రమైన కోల్డ్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నట్టు అధికారులు తేల్చారు.



