కాంగ్రెస్‌ బిగ్ షాక్.. అర్విందర్‌ సింగ్‌ రాజీనామా

నవతెలంగాణ – ఢిల్లీ: కాంగ్రెస్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ  తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ యూనిట్‌ అంగీకరించలేదని రాజీనామా లేఖలో అర్విందర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు. అయితే, మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ, రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు.

Spread the love