నిరసన తెలిపిన వారిపై లాఠీచార్జీ సమర్థనీయం కాదు
పార్లమెంట్ మార్చ్లో పోలీసుల చర్యలపై సుప్రీం వ్యాఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును నిరాకరించలేమని, ఆందోళన జరుగుతున్నంత మాత్రాన పోలీసులు లాఠీచార్జీ చేయడం సమర్థనీయం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పరీక్షా పత్రాల లీకేజీకి నిరసనగా విద్యార్థుల ఆందోళనలో భాగంగా జులై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్లో పోలీసులు మితిమీరి ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమల్య బాగ్చి, వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘శాంతియుత, చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా కల్పించబడింది. కేవలం ఆందోళన జరుగుతున్నంత మాత్రాన లాఠీచార్జీ చేయడంలో అర్థం లేదు. మితిమీరిన బలప్రయోగం జరిగిందన్న ఏ ఆరోపణనైనా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పరిశీలించాలి’’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ సమస్య ఢిల్లీకే పరిమితం కాదని, నిరసన ప్రదర్శనల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏకరీతి నియమాలు అవసరమని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆత్మ సంయమనం ఒక ముఖ్యమైన భాగమని పేర్కొంటూ నిరసనకారులు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలని అన్నారు. నిరసనల సమయంలో హింస కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతియుత నిరసనకారులపై విచక్షణారహిత బలప్రయోగం జరగకుండా చూసుకుంటూనే, హింసలో పాల్గొన్న సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
రాజ్యాంగ హక్కును నిరాకరించలేం
- Advertisement -
- Advertisement -



