ముగిసిన క్యూబా పర్యటన
న్యూఢిల్లీ : క్యూబా విప్లవనేత ఫైడల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్ళిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం తమ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. పొలిట్బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్ నేతృత్వంలోని ఈ బృందం తమ పర్యటనలో భాగంగా హవానాలోని కార్డియాలజీ ఆస్పత్రిని, చిన్నారుల కేన్సర్ ఆస్పత్రిని సందర్శించింది. క్యూబా ప్రజలకు సంఘీభావంగా వారి కోసం సీపీఐ(ఎం), సీపీఐ సేకరించిన ప్రాణాధార ఔషధాలను అందజేసింది. అమెరికా దీర్ఘకాలంగా అమలు చేస్తున్న ఆంక్షల వల్ల క్యూబా ప్రజలు ఆహారం, మందులతో సహా పలు నిత్యావసరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్యూబా పర్యటనలో భాగంగా ఫైడల్ కాస్ట్రో సెంటర్, చెగువేరా సెంటర్, క్యూబన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ది పీపుల్స్ (ఐపీఏపీ)లను కూడా ప్రతినిధి బృందం సందర్శించింది. ఐపీఏపీ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నోయిమి రబజా ఫెర్నాండెజ్తో భేటీ అయ్యింది. అమెరికా వ్యతిరేక విధ్వంసక కార్యకలాపాల్లో పాల్గొంటున్న పలు క్యూబా సంస్థల్లో ఐపీఏపీ ఒకటని గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. క్యూబాతో అంతర్జాతీయ సంఘీభావాన్ని నేరపూరితం చేసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణా కార్యాలయం (ఒఎఫ్ఎసి) ఆంక్షల జాబితాలో ఆ సంస్థను పెట్టారు. సామ్రాజ్యవాద దురాక్రమణ, ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటన క్యూబన్లతో సీపీఐ(ఎం) సంఘీభావాన్ని, క్యూబాతో అంతర్జాతీయ సంఘీభావాన్ని బలోపేతం చేసుకోవాలనుకునే పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ ప్రతినిధి బృందంలో కేంద్ర కమిటీ సభ్యులు పి.కె.శ్రీమతి, కర్నాటక రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు మీనాక్షి సుందరం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ధర్మరాజ్ మహాపాత్ర, కేరళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.చంద్రన్, వ్యవసాయ సబ్ కమిటీ సభ్యులు బి.వెంకట్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వర్గ సభ్యులు అనీల్ ఎస్.ఎస్. సభ్యులుగా ఉన్నారు.
స్వదేశానికి సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం
- Advertisement -
- Advertisement -



