చెన్నై : మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారిపైనైనా చట్టం ప్రకారం చర్యలు తప్పవని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని విజయ్ సూచించారు. ప్రజలను, ముఖ్యంగా … మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ విమర్శలకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలని విజయ్ అన్నారు. నేరాలు జరిగిన తర్వాత నిందితులను అరెస్టు చేయడం కంటే.. నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించడమే పోలీసుల ప్రధాన బాధ్యత కావాలని పేర్కొన్నారు. చట్టాన్ని పాటించే ప్రజలకు పోలీసులు మిత్రులుగా, ఉల్లంఘించేవారికి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో చర్యలు చేపట్టడంలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్ నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని హెచ్చరించారు.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు : సీఎం విజయ్
- Advertisement -
- Advertisement -



