నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న, నిరుద్యోగ సమస్య, ఇతర సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 15న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మహాధర్నాలో ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలతోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే వరకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించాలని, యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరింది. విద్యావంతుల జీవితాలు దెబ్బతినకుండా ప్రభుత్వ విధానాలు ఉండాలని, స్వయం ఉపాధి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి యువతకు విస్తృత అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో మహాధర్నాకు హాజరై విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.



