ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సీజన్లో లభించే పండ్లను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్తారు. అయితే పండ్లను తీసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.
పండ్లను భోజనానికి అరగంట ముందు తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే భోజనం తర్వాత పండ్లను తింటే, పండ్లలోని అదనపు కేలరీలు ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తాయని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే పండ్లను తీసుకోకూడదని చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం పండ్లను తీసుకోవడానికి సరైన సమయంగా చెబుతున్నారు.
భోజనం చేయగానే ఎట్టి పరిస్థితుల్లో పండ్లను తీసుకోకూడదు. దీనికి కారణం భోజనం చేయగానే శరీరంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే కంటే ముందే మళ్లీ పండ్లను తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై రెట్టింపు భారం పడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భోజనం కంటే కనీసం రెండు గంటల ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవడం బెస్ట్ అని చెబుతున్నారు. ఇక ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.