ప్రతిఘటనా ఉద్యమాలతో బలపడతాం
బీజేపీ, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాం
పినరయి విజయన్పై ఈడీ దాడుల వెనుక బీజేపీ, కాంగ్రెస్ హస్తం :
సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ దుర్మార్గాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులను కేసులతో భయపెట్టడం, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు మోడీ సర్కారు పూనుకున్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. బెదిరింపులకు, కేసులకు భయపడబోమనీ, ప్రతిఘటనా ఉద్యమాలతో మరింత బలపడతామని అన్నారు. కేరళం మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ దాడులను నిరసిస్తూ గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్ లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందు ఎంబీ భవన్(సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం) నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ‘ఈడీ, మోడీగో బ్యాక్ గోబ్యాక్…, పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడిని ఖండించండి.. ఖండించండి…, మోడీ, ఈడీ డౌన్డౌన్…, బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను డ్డుకుందాం..అడ్డుకుందాం..’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసనలో రాఘవులు మాట్లాడుతూ.. కేరళం మాజీ సీఎం, పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్పై ఒక్క అవినీతి కేసు కూడా లేదన్నారు. ఈడీ చెబుతున్న కేసులో నిందితులుగానీ, ఆ సంస్థగానీ ఏనాడూ విజయన్ పేరును ప్రస్తావించలేదని ఎత్తిచూపారు. ఇది ముమ్మాటికీ రాజకీయ దాడేనని తేల్చి చెప్పారు. విచారణల పేరుతో దాడులు చేయడం వామపక్షాలను, సీపీఐ(ఎం) ను దెబ్బతీయడంలో భాగమేనన్నారు. కేంద్ర దర్యాపు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీకి కొత్తగాదనీ, బీజేపీకి ఆటంకంగా మారిన కేజ్రీవాల్, సిసోడియా, ఆప్ నేతలు, జార్ఖండ్ సీఎం సోరెన్, తదితరులపై ఈడీని ప్రయోగించి రాజకీయంగా అణచివేసిందని విమర్శించారు.
మరికొందరు నేతలను తనవైపు తిప్పుకుని, లొంగదీసుకుని సీఎంలను చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ కేసులు పెట్టి విచారణల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పిందని అన్నారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు, ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను సీపీఐ(ఎం) ఖండిస్తూ వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులను ఐటీ స్తంభింపజేస్తే కూడా సీపీఐ(ఎం) ఖండించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజలను సమీకరించి ప్రతిఘటించే ఉద్యమాలు చేసే సీపీఐ(ఎం) నాయకులపై ఈ విధంగా దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతల మౌనం వెనుక మర్మం ఏంటని ప్రశ్నించారు. కేరళంలో సీపీఐ(ఎం)ను బలహీనం చేయాలనే దుర్మార్గపూరిత ఆలోచనతో కాంగ్రెస్, బీజేపీలు కలిపి ఈ దాడికి ఉసిగొల్పాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ఇటీవల కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రధాని మోడీని కలిసినప్పడు విజయన్ను అరెస్టు చేయాలని ఒత్తిడి తెచ్చారనే అనుమానాలూ కలుగుతు న్నాయని చెప్పారు. విజయన్ను అరెస్టు చేయాలని రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ముఖ్యమా? బీజేపీ నియంతృత్వానికి సహకరించడం ముఖ్య మా? అనే విషయాన్ని కాంగ్రెస్ తేల్చుకోవాలని సూచించారు. ఢిల్లీలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబీ, పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, తదితరులు నిరసన తెలిపినందుకు అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తప్పుబట్టారు.
విజయన్పైనే కాదు ఇంకెంత మంది సీపీఐ(ఎం) నాయకులపై కేసులు పెట్టి వేధించినా బీజేపీకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకుని సీపీఐ(ఎం) పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆ పోరాటంలో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ..పినరయి విజయన్పై ఈడీ దాడులను ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసి అప్రతిష్ట పాలు చేయడానికి అక్రమ కేసులు పెట్టడం, పార్టీలను చీల్చడం వంటి నియంతృత్వ ధోరణులను కొనసాగించడానికి రాజ్యాంగ సంస్థలను బీజేపీ వాడుకుంటున్నదని విమర్శించారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ గమ్ముగా ఉంటే ఆ పార్టీ మరింత నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. మోడీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యలు టి.జ్యోతి, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(మాజీ ఎమ్మెల్యే), ఎస్.వీరయ్య, చుక్క రాములు, టి.సాగర్, పాలడుగు భాస్కర్, అబ్బాస్, మల్లులక్ష్మి, బండారు రవికుమార్, పి.ప్రభాకర్, నున్నా నాగేశ్వర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, హైదరాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.


