దుమ్మురేపుతున్న రోడ్డు..

– నెలలు గడుస్తున్న పట్టించుకోని వైనం
– వ్యాధుల భారిన పడుతున్నామంటూ విలపిస్తున్న వ్యాపారస్థులు
నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని మల్లన్న గుడి ప్రధాన ద్వారం నిత్యం వాహనాల రాకపోకలతో దుమ్మురేపుతున్నప్పటికి అటువైపుగా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు, వ్యాపారస్థులు విలపిస్తున్నారు. గత నెల రోజుల క్రితం కోహెడ ` శ్రీరాములపల్లి వెళ్ళే ప్రధాన రహాదారి మల్లన్న ఆలయ ముఖద్వారం మూలమలుపు వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి నీరు ఎగసిపడడంతో మిషన్‌భగీరథ అధికారులు కొద్ది రోజుల సమయంలో సవరించి పునరుద్ధరించారు. పైప్‌లైన్‌ను సవరించడం పూర్తయ్యినప్పటికి తారురోడ్డు పూర్తిగా పోయి మట్టిరోడ్డుగా మారింది. మూలమలుపు కావడంతో వాహనాలు అక్కడికి చేరుకోగానే అతిగా దుమ్ములేసి ప్రక్కనే ఉన్న ఇండ్లలో, వ్యాపార దుకాణాలలో పూర్తిగా మట్టితో నిండిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతిగా దుమ్ము లేవడంతో తమ దుకాణాలలో వ్యాపారం చేసుకోలేకపోతున్నామని మాస్క్‌ వాడినప్పటికి జలుబు, జ్వరం తదితర సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు తగిన చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని పులువురు గ్రామస్థులు, వ్యాపారస్థులు కోరుతున్నారు.
షాపు పూర్తిగా దుమ్ముతో నిండిపోతుంది:
పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసినప్పటికి తారు రోడ్డు పూర్తిగా మట్టిరోడ్డుగా మారిపోయింది. అలాగే నిత్యం వాహనాల రాకపోకలతో దుమ్ము మొత్తం షాపులలోకి వచ్చి చేరుతుంది. మెడికల్‌షాపు పూర్తిగా దుమ్ముతో నిండిపోతుంది. అలాగే చుట్టు ప్రక్కల షాపులన్ని దుమ్ముతో నిండిపోవడంతో షాపు తూడ్చుకుంటూ ఉండేందుకే ఎక్కువ సమయం గడుస్తుంది. తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. జాలిగాం రాజు (మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు)
Spread the love