– విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటిన అతిథులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, మండల విద్యాశాఖాధికారి నక్కా రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు వివరించారు. చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.



