– అధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలని సూచించారు. వేదికను శుభ్రపరచడం, తాగునీరు, ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదేవిధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీలు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.