పచ్చని పోలాల్లో ఇథనాల్ చిచ్చు 

– అనుమతులు రద్దు చేయాలని గుగ్గీల్ల,పోతారం రైతుల డిమాండ్ 

– పంటలు నాశనం..పర్యావరణానికి హానికరమని అందోళన 
– వ్యర్థాలతో పంటలు నాశనమవుతాయని ఆవేదన
నవతెలంగాణ – బెజ్జంకి
వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న వారి జీవితాల్లో ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం చిచ్చురేపుతోంది. ఇన్నేండ్లు పొలాల్లో పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల బతుకుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకేత్తుతోంది.పచ్చని పంట పొలాల మధ్య ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం వారి ఆందోళనకు కారణమవుతోంది. పంట పొలాలను నాశనం చేసే ఈ పరిశ్రమ నిర్మాణ అనుమతులను వ్యతిరేకిస్తూ మండలంలోని గుగ్గీల్ల రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాటపట్టారు.ఇప్పుడు పోతారం రైతులు అందోళనలు చేపట్టడానికి సిద్ధమవతున్నారు.ఈ పరిశ్రమ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి రైతులకు నిద్ర లేకుండా చేసిందని మండలంలో ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణాన్ని రద్దు చేయాలని అయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.పరిశ్రమ నిర్మాణ అనుమతుల రద్దుపై ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నారు.వీరికి చుట్టుపక్కల గ్రామాల రైతులు మద్దతు తెలుపుతున్నారు.

పచ్చని పంట పొలాల్లోకి రసాయన పరిశ్రమలు రావడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో సుమారు 22 ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం,తయారైన ఇథనాల్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి పోతారం గ్రామ శివారులో స్టోరేజ్ నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.మరోపక్క పరిశ్రమ నిర్మాణంపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ పరిశ్రమ ప్రారంభమైతే చుట్టుపక్కల పొలాలపై ప్రభావం పడుతుందని.. వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు దుర్వాసన వస్తుందని, జీవ వైవిధ్యానికి అవరోధంగా మారుతుందని భావించిన రైతులు పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గుగ్గీల్ల గ్రామ శివారుల్లోని పరిశ్రమల వ్యర్థాలు చుట్టుపక్కల సమీప పొలాల్లోకి రావడంతో దుర్వాసన కారణంగా పనులు చేసేందుకు కూలీలు ఎవరూ రావడం లేదని తెలుసుకున్న రైతులు ఇక్కడ ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. సుమారు గత కొద్ది నెలల నుంచి వివిధ రూపాల్లో నిరసన కొనసాగుతోంది. అధికారులు,పాలకవర్గం తీరుపై రైతుల అగ్రహం ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా అధికారులు,అయా గ్రామాల పంచాయతీల పాలకవర్గం సభ్యులు కుమ్మక్కయి పరిశ్రమ యాజమాన్యానికి అనుగుణంగా పంచాయతీ తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి అందజేశారని అయా గ్రామాల రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి అధికారులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు సహకరించేల వ్యవహరిస్తు తమ జీవితాల్లో మట్టి కొడుతున్నారని రైతులు అవేదన వెలిగక్కుతున్నారు.

గ్రామంలో శాంతియుత నిరసన
గుగ్గీల్ల గ్రామ శివారులో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ చుట్టుపక్కల సుమారు వందల ఎకరాల్లో పంట పొలాలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ పొలాలకు హాని జరుగుతుందనే కారణంగా ఈ పరిశ్రమను రద్దు చేయాలని గ్రామ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ గ్రామ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఊరంతా ఒక్కటై నిరసన గళం వినిపిస్తున్నారు.
కాలుష్యంతో పంటలు నాశనం
రైతుల జీవితాల్లో ఈ పరిశ్రమ నిర్మాణం అవరోధంగా మారుతుంది.ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం కారణంగా పంటలు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది.గుగ్గీల్ల గ్రామ శివారులో నెలకొల్పిన పరిశ్రమల వల్ల దుర్వాసన వస్తూ వ్యర్థాలు సమీప పొలాల్లోకి వస్తుండడంతో కూలీలు ఎవరూ రావడం లేదు. ఇప్పటికే వివిధ కారణాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.ఈ పరిశ్రమతో మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది.వేంటనే ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలి. – మానాల రవి,పోతారం. 
నిబంధనల మేరకే తీర్మానం 
పోతారం గ్రామ శివారులో ఇథనాల్ ఇంధన నిల్వ కోసం చేపట్టనున్న గోదాం నిర్మాణానికి నిబంధనల మేరకే పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మాణం చేసి అధికారులకు అందజేశాం.గోదాం నిర్మాణానికి పై గ్రామస్తుల నుండి అభ్యంతరాల స్వీకరణకు డీపీఓ, ఎంపీడీఓ అధికారుల అదేశం ప్రకారం పంచాయతీ కార్యాలయం వద్ద నోటీస్ ఏర్పాటుచేసి సుమారు 15 రోజుల గడువుకాలం ముగిసిన తర్వాత పంచాయతీ పాలకవర్గం సభ్యులతో గ్రామ సభ ఏర్పాటుచేసి తీర్మాణం చేసి అందజేశాం. – నాగు జ్యోతి,పంచాయతీ కార్యదర్శి,పోతారం.
Spread the love