నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు లేకుండానే పలు బిల్లులపై మోడీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయించుకుంటుంది. సోమవారం లోక్ సభలో విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు-2026పై విపక్షాలు పలు సందేహాలు లెవనెత్తిన పట్టించుకోకుండా హడవిడిగా ఆమోదించారు. దీంతో సదురు బిల్లుపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని తమిళనాడు శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. రాష్ట్రాలు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని సూచించింది. మిజోరంలో వివిధ క్రైస్తవ మత విభాగాలకు చెందిన వేలాది మంది ఐజ్వాల్లో ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మిజోరం కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ విమర్శల నేపథ్యంలో ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గింది.విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు-2026ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపన్నుట్లు సమాచారం.
కాగా, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును 2026 మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎఫ్సీఆర్ఏ నమోదు రద్దైన, స్వచ్ఛందంగా వదులుకున్న లేదా పునరుద్ధరణ పొందని సంస్థలకు చెందిన విదేశీ విరాళాలు, ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, వాటి భవిష్యత్ వినియోగానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. చట్టంలోని జరిమానా విధానంలో మార్పులు కూడా ఇందులో ప్రతిపాదించారు. ఎఫ్ఫ్సీఆర్ఏ నమోదు రద్దు అయినప్పుడు లేదా పునరుద్ధరణ జరగనప్పుడు చర్చిలు, స్వచ్ఛంద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా విక్రయించే పరిస్థితులు ఏర్పడతాయని నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.



