నవతెలంగాణ-మర్రిగూడ : మండలంలోని యరుగండ్లపల్లి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా,ముందస్తు చర్యలు చేపట్టే దిశగా గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ చొరవ చూపుతున్నారు. ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో,గ్రామంలోని తాగునీటి సమస్యలపై సర్పంచ్ గళమెత్తి,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ సంతోష్ యాదవ్ ప్రస్తావించిన సమస్యపై స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మంగళవారం యరుగండ్లపల్లి గ్రామాన్ని సందర్శించారు.రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలు, గ్రామంలో నీటి సరఫరా పరిస్థితి, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై, సర్పంచ్తో కలిసి సమీక్ష నిర్వహించారు.గ్రామ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు చర్చించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటమే తన ప్రధాన బాధ్యతని అన్నారు.సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే,ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులతో,నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యల కోసం, అధికారులతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.అనంతరం జల మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమంలో మ గ్రామంలో నీటి సంరక్షణ, సురక్షిత తాగునీటి వినియోగం, ప్రతి ఇంటికీ నీటి సరఫరా లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రిడ్ ఏఈ వెంకటేష్,ఆర్డబ్ల్యూసీ ఏఈ ప్రభాకర్,పంచాయతీ కార్యదర్శి ఇరిగి శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



