నవతెలంగాణ-హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా, హసన్పర్తి మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన భరత్ చందర్ రెడ్డి (29) ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో గత నెల 25న ఫ్లోరిడాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ గత 15 రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
యువకుడి మరణవార్త తెలియగానే గుంటూరుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడనే వార్త విని భరత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భరత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నత భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తమ బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.



