నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానాలో అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు ‘అమరవీరుల’ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. 20 డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మంగళవారం హెచ్చరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఒక ఉక్కు కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, మృతుల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, విధి నిర్వహణలో శారీరకంగా గాయపడిన లేదా ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి భవిష్యత్తులో తగిన సహాయం అందేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధులతో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే, ఆ మూడు సార్లు చర్చలు విఫలమవడంతో, సమ్మెను ఇప్పుడు ఏప్రిల్ 17 వరకు పొడిగించారు. ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరించకపోతే, ఈ సమ్మె నిరవధిక నిరసనగా మారే అవకాశం ఉంది.



