ఇరాన్ పరిణమాలు, ఉక్రెయిన్ యుద్ధం, చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలపై చర్చలు
పారిస్ : అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ప్రాథమిక ఒప్పందానికి వచ్చిన కొద్ది గంటలకే.. ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రజాస్వామ్య దేశాల సమూహమైన జీ7 దేశాల నాయకులు సమావేశమయ్యారు. జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఫ్రాన్స్లోని ఎవియన్-లే-బెయిన్స్ సరస్సు తీర ప్రాంతం కేంద్రమైంది. నేటి నుంచి 17 వరకు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరాన్ పరిణామాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ఆధిపత్యంలో ఉన్న కీలక ఖనిజాల సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సమావే శానికి హాజరుకానున్నారు. గతేడాది కెనడాలో జరిగిన జీ7 సదస్సును మధ్యలోనే వీడి వెళ్లిన ట్రంప్.. ఈ సారి హాజరవుతున్నందుకు ఫ్రాన్స్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యప్రాచ్యం, అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య సంబంధాల విషయంలో ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు అనేక దేశాల్లో ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ7 సమావేశం నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ట్రంప్.. పశ్చిమాసియా నాయకులతో సమావేశం కానుండగా.. మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేక చర్చలు జరపున్నారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్.. జీ7 లో లేని దేశాలను కూడా ఈ సదస్సు కు ఆహ్వానించారు. ఇందులో ఈజిప్ట్, ఖతర్, ఉక్రెయిన్, యూఏఈలు ఉన్నా యి. కాగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం వివరాలను తెలుసుకోవడంపై జీ7 దేశాలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. ఈ అవగాహన ఒప్పందంపై జూన్ 19న స్విట్జర్లాండ్లో అధికారికంగా సంతకాలు జరగను న్నప్పటికీ, దాని ఖచ్చితమైన నిబంధనలు ఇంకా వెల్లడికాలేదు.
మ్యాక్రాన్కు కీలక దౌత్య వేదిక
ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కు ఈ సదస్సు ఆయన రెండో, చివరి అధ్యక్ష పదవీకాలానికి ఒక ప్రధాన దౌత్య ఘట్టంగా పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆయన పదవీకాలం ముగియనుండగా.. దేశీయ రాజకీయాల్లో ప్రభావం తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ వేదికపై ఆయనకు ఇంకా ప్రాధాన్యం ఉందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలపై చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావి స్తోంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా దేశాలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పలువురు ప్రపంచ దేశాధినేతులు, ప్రతినిధులు హాజరు కానున్న ఈ సమావేశం కోసం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశ ముందన్న అంచనాలను దృష్టిలో పెట్టు కొని జెనీవా ప్రధాన ఆస్పత్రి అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసింది. కాగా కొందరు నిరసనకారుల నుంచి కత్తులు, గొడ్డళ్లు, గ్యాస్ క్యానిస్టర్లు, శక్తివంతమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



