నవతెలంగాణ-హైదరాబాద్: పర్యాటక శాఖ డైరెక్టర్ రంజీత్ నాయక్, తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు, నిథమ్ (NiTHAM) డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట రామన్ ల సహకారంతో, బుధవారం కాజహనా బిల్డింగ్ (KB) మ్యూజియం నుండి చారిత్రాత్మక గోల్కొండ కోట వరకు ఒక వారసత్వ యాత్రను నిర్వహించారు. కేబీ మ్యూజియం నుండి ప్రారంభమైన ఈ హెరిటేజ్ వాక్లో, డిప్యూటీ డైరెక్టర్ (మ్యూజియంలు) డాక్టర్ పి.నాగరాజు, కజనా బిల్డింగ్ మ్యూజియం ప్రాముఖ్యత, సేకరణలు, చరిత్ర గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని డైరెక్టర్, తెలంగాణ వారసత్వ శాఖ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనేక వారసత్వ సంస్థలు, ఎన్జీవోలు చురుకుగా పాల్గొన్నాయి. వాటిలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రముఖమైనది. దీనికి చైర్మన్ ఇంజనీర్ వేద కుమార్ నాయకత్వం వహించగా, ఇతర వారసత్వ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ నడక సందర్భంగా, వృత్తిపరమైన టూరిస్ట్ గైడ్లు గోల్కొండ కోట చారిత్రక ప్రాముఖ్యత, దాని వాస్తుశిల్పం, సాంస్కృతిక ప్రాముఖ్యత, కుతుబ్ షాహీ వంశ చరిత్రలో దాని పాత్ర గురించి వివరించారు.ఈ తరహా కార్యక్రమాలతొ తెలంగాణలో వారసత్వ సంరక్షణ, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ చారిత్రక వారసత్వంపై సంస్కృతిపై ప్రజలకు, పర్యాటకులలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు..



