నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ను తమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. నల్సార్లో సీజేఐ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే 2026 బ్యాచ్ స్నాతకోత్సవ తేదీని, ముఖ్య అతిథిగా సీజేఐ హాజరవుతారనే విషయాన్ని విశ్వవిద్యాలయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఢిల్లీలో జరిగిన నిరసనలకు నల్సార్ విద్యార్థులు జూలై 20న సంఘీభావం తెలిపారు. పలువురు విద్యార్థులు ఒకపూట భోజనం మానేసి నిరసన చేపట్టారు. జూలై 22న నిరసనకారులపై పోలీసుల చర్యలకు సంబంధించి సుమోటోగా విచారణ చేపట్టేందుకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించడంతో విద్యార్థుల ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈ సందర్భంగా సీజేఐ చేసిన ‘మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం లేదు’, ‘మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయొద్దు’ వంటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో జూలై 23న విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. సుమారు 70 మంది విద్యార్థులు, స్టూడెంట్స్ బార్ కౌన్సిల్ సభ్యులు సహా, ఈ వినతిపత్రానికి మద్దతు తెలిపారు. ‘రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే హక్కు, ప్రజల సమస్యలపై హేతుబద్ధమైన చర్చ వంటి విలువలను నల్సార్లో నేర్చుకున్నాం. పోలీసుల దౌర్జన్యంపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్న వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు అందుకోవడం ఈ విలువలకు విరుద్ధంగా ఉంది’ అని విద్యార్థులు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సమాధానం రాకపోతే వారం రోజుల ముందుగా నోటీసు ఇచ్చి నిరసన చేపడతామని విద్యార్థులు స్పష్టం చేశారు.



