నిఖత్ జరీన్తో బౌట్పై సాక్షి చౌదరి
పటియాలా : ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్. 25 ఏండ్ల సాక్షి చౌదరి అప్పటివరకు మహిళల 54 కేజీల విభాగంలో పోటీపడింది. బిఎఫ్ఐ తొలుత నిర్వహించిన అసెస్మెంట్ టెస్టులో సాక్షి చౌదరి మూడో స్థానానికి పరిమితమైంది. గాయంతో 2022 ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్కు దూరమైన సాక్షి చౌదరి.. రెండు సార్లు ప్రపంచ జూనియర్ చాంపియన్గా నిలిచినా సీనియర్ సర్క్యూట్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ ఏడాది ఆసియా, కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించకుంటే సాక్షి చౌదరి జాతీయ బాక్సింగ్ సర్కిల్లో ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం. ఇటువంటి తరుణంలో సాయ్ ఆదేశాలతో నిర్వహించిన ట్రయల్స్కు సాక్షి చౌదరి వెయిట్ కేటగిరీనీ మార్చుకుంది. 54 కేజీల నుంచి 51 కేజీల విభాగానికి మారింది. 51 కేజీల విభాగంలో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ పోటీపడుతున్నా.. సాక్షి చౌదరి సాహాసోపేత నిర్ణయం తీసుకుంది. ‘నా ఆలోచన సింపుల్. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించాలి. నాకిది చావోరేవో. నిఖత్ జరీన్ బలమైన బాక్సర్. నిఖత్ రేంజ్లోకి వెళితే వదిలిపెట్టదు. అందుకే, ఆమెకు దూరంగా ఉంటూ లెఫ్ట్ జాబ్స్ సంధించటంపై దృష్టి నిలిపాను. గతంలో మీనాక్షిపై ఇదే తరహా వ్యూహంతో పైచేయి సాధించాను. నిఖత్ జరీన్తో బౌట్నూ అదే పని చేశాను. నిఖత్ పంచ్కు చిక్కకుండా దూరంగా ఉంటూనే.. లెఫ్ట్ జాబ్స్ ఇవ్వటంలో విజయవంతం అయ్యాను. ఈ విభాగంలో వేగం, పవర్ది పైచేయి. 54 కేజీల విభాగంలో బాక్సర్లు కాస్త ఎత్తుగా ఉంటారు. 51 విభాగంలో ఎత్తు నాకు కలిసిసొచ్చింది’ అని సాక్షి చౌదరి తెలిపింది. పటియాలాలో గురువారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో నిఖత్ జరీన్పై సాక్షి చౌదరి 4-1తో గెలుపొంది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
నాకిది చావోరేవో
- Advertisement -
- Advertisement -



