పశ్చిమాసియా ఉద్రిక్తతలను
కారణంగా చూపుతున్న కేంద్రం
చమురు ధరల భారమంతా సాధారణ ప్రజల పైనే
రవాణా నుంచి కూరగాయల వరకు అన్ని ధరలకూ రెక్కలు!పశ్చిమాసియా ఉద్రిక్తతలను కారణంగా చూపుతున్న కేంద్రం
దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం : ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు
పశ్చిమాసియా ఉద్రిక్తతలను కారణంగా చూపుతున్న కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ప్రభుత్వరంగ చమురు సంస్థలు లీటరుకు సుమారు రూ.3 చొప్పున ధరలు పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.77కు చేరింది. డీజీల్ ధర రూ.90.67కు ఎగబాకింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల కారణమని కేంద్రం చెప్తున్నప్పటికీ.. ఈ భారాన్ని పూర్తిగా ప్రజల పైనే మోపుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు ఇంధన పొదుపు సందేశం..
ఉపశమన చర్యలు శూన్యం
ప్రధాని మోడీ ఇటీవల ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించిన విషయం విదితమే. ఇది జరిగిన కొన్ని రోజులకే కేంద్రం ప్రజలపై పెట్రో వడ్డన షురూ చేయడం గమనార్హం. అయితే ఇంధన ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఎలాంటి ప్రత్యక్ష ఉపశమన చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపిస్తూ కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు విమర్శిస్తున్నారు.
న్యూఢిల్లీరవాణా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం
దేశంలో పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదల ప్రభావం ముందుగా రవాణా రంగంపై పడనుంది. కార్లు, బైకులు వినియోగించే వారి రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరగనుండగా.. డీజీల్పై ఆధారపడే బస్సులు, లారీలు, సరుకు రవాణా వ్యవస్థలకు అదనపు భారం పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. దీని ప్రభావంతో ఆటో, క్యాబ్ ఛార్జీలు, సరుకు రవాణా ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వంటింటిపై కూడా మంట
భారత్లో ఎక్కువ శాతం ఆహార సరఫరా రోడ్డు రవాణా పైనే ఆధారపడుతుంది. డీజీల్ ధరలు పెరగడంతో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, ప్యాకేజ్డ్ వస్తువుల రవాణా ఖర్చులు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. చివరకి ఈ భారం వినయోగదారుల పైనే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమూల్, మదర్ డైరీ పాలు లీటరుకు రూ.2 పెంచడం దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. ఇక ఇంధన ధరలు ఇలాగే దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలో కొనసాగితే.. ఆహార ద్రవ్యోల్బణం కూడా మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఆన్లైన్ డెలివరీలు, ఈ-కామర్స్ సేవలపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదలతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, కొరియర్, ఈ-కామర్స్ సంస్థల రవాణా వ్యయాలు పెరగనున్నాయి. దీంతో డెలివరీ ఛార్జీలు పెరగడం, డిస్కౌంట్లు తగ్గించడం, కనీస ఆర్డర్ విలువలను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
ఇంధన ధరల పెరుగుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైనా తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. డీజీల్పై ఆధారపడే ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ రవాణా వాహనాల ఖర్చులు పెరగనున్నాయి. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరిగితే ఆ ప్రభావం తిరిగి ఆహార ధరల రూపంలో ప్రజల పైనే పడుతుందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం
చమురు ధరల పెరుగుదల ప్రభావం దాదాపు అన్ని రంగాల పైనా ఉంటుంది. తయారీ, రిటైల్, వ్యవసాయం, సేవారంగం… ఇలా ప్రతి చోటా ఖర్చలు పెరుగుతాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టోకు ద్రవ్యోల్బణం పెరుగుతుండగా, ఇంధన ధరల పెంపు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘డబుల్ ఇంజిన్’ ప్రచారం.. ప్రజలకు డబుల్ భారం
గత పన్నెండేండ్ల మోడీ పాలనలో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదలలు నిత్యకృత్యమ య్యాయి. అయితే ప్రజల ఆదాయాలు మాత్రం అదే స్థాయిలో పెరగడం లేవు. ఇంధనం నుంచి ఆహారం వరకు.. ప్రతి వస్తువు ధరా పెరుగుతుండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ ధరల నియంత్రణలో మోడీ సర్కారు విఫలమవుతోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. చివరకు ప్రతీ సంక్షోభానికి మూల్యం చెల్లించేది సామాన్య ప్రజలేనని వివరిస్తున్నారు.



